అసలేమిటీ 'జిహాదీ డ్రగ్'... భారత్ లో తొలిసారిగా పట్టుబడింది!

  • మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్‌లో భాగంగా జిహాదీ డ్రగ్ గుర్తింపు
  • రూ.182 కోట్ల విలువైన క్యాప్టగన్ ట్యాబ్లెట్ల గుర్తింపు
  • సిరియా అంతర్యుద్ధం సమయంలో ఉపయోగించిన ఐసిస్ ఉగ్రవాదులు
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) నేతృత్వంలో జరిగిన భారీ మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్‌లో భాగంగా 'జిహాదీ డ్రగ్'గా పేర్కొనే వివాదాస్పద సింథటిక్ ఉత్ప్రేరకమైన 'క్యాప్టగన్‌'ను మనదేశంలో మొట్టమొదటిసారి స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ప్రకటించారు. 'ఆపరేషన్ రేజ్‌పిల్'లో భాగంగా నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.182 కోట్ల విలువైన 'క్యాప్టగన్‌' ట్యాబ్లెట్లను గుర్తించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సిండికేట్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరియా జాతీయుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్, ఢిల్లీలోని వెబ్ సరాయ్ ప్రాంతంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఈ డ్రగ్ గల్ఫ్ దేశాలకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు అమిత్ షా తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్‌పై అధికారులు విచారణ ప్రారంభించారు. 'క్యాప్టగన్‌'ను సాధారణంగా 'జిహాదీ డ్రగ్', 'పేదవాడి కొకైన్‌' అని పిలుస్తారు. ఇది అతి తక్కువ ధరకు లభిస్తుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో, యుద్ద ప్రాంతాల్లో ఈ డ్రగ్‌ను అధికంగా వినియోగిస్తారు. సిరియా అంతర్యుద్ధం సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు దీనిని పెద్ద ఎత్తున ఉపయోగించారు.

ఈ డ్రగ్‌ను తీసుకుంటే ఎక్కువ గంటలు నిద్ర లేకుండా ఉండటం, భయం, అలసట లేకుండా ఉండటం వంటి ప్రభావాలను కలిగిస్తుంది. అందుకే దీనిని 'జిహాదీ డ్రగ్' అని పిలుస్తారు. 1960లలో దీనిని దృష్టిలోపం, నార్కోలెప్సీ ఉన్న రోగులకు చికిత్సలో ఉపయోగించేవారు. దీనిని ఉపయోగిస్తే ఆ మత్తు అలవాటుగా మారుతుందని అనేక దేశాలు దీనిని నిషేధించాయి. కానీ ఇది అసలైన డ్రగ్ కాదు. ప్రస్తుతం బ్లాక్ మార్కెట్‌లో మాత్రమే క్యాప్టగన్ లభిస్తోంది. ఇందులో రహస్యంగా యాంఫెటమైన్, మెతాంఫెటమైన్ వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారు. ఈ డ్రగ్‌ను వినియోగిస్తే కాసేపు ఉత్సాహంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంగా తీవ్ర మానసిక సమస్యలు, హింసాత్మక ప్రవర్తన వంటి దుష్పరిణామాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Captagon
Jihadi Drug
Narcotics Control Bureau
NCB
Amit Shah
Operation Ragepil
Drug Seizure India

More Telugu News